Sri Bhagavad Gita Part11, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu

విశ్వరూపసందర్శన యోగం(11 వ అధ్యాయం)
Sri Bhagavad Gita Part11, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu
అర్జునుడు:

దయతో నీవు చెప్పిన రహస్య జ్ఞానం వలన నా మోహం నశిస్తోంది.నీ మహాత్మ్యం గురించి ఎంతో కరుణతో చెప్పావు.నీ విస్వరూపం చూడాలని ఉంది.నాకు అర్హత ఉందనుకుంటే దయచేసి చూపించు.

Sri Bhagavad Gita Part11, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu 1

 

శ్రీకృష్ణుడు:
అనేక విధాలైన,వర్ణాలు కల్గిన నా అలౌకిక దివ్యరూపం చూడు. ఆదిత్యులు,వసువులు,రుద్రులు,దేవతలు మొదలైన నీవు చూడనిదంతా నాలో చూడు.నీవు చూడాలనుకున్నదంతా చూడు.సామాన్య దృష్టి తో నీవు చూడలేవు కావున దివ్యదృష్టి ఇస్తున్నాను.చూడు.
సంజయుడు:
ధృతరాష్ట్ర రాజా!అనేక ముఖాలతో,నేత్రాలతో,అద్భుతాలతో,ఆశ్చర్యాలతో దేదీప్యమానంగా,వేయిసూర్యుల వెలుగును మించిన తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు.
జగత్తు మొత్తం కేవలం అతని శరీరంలో ఉన్న ఒకే భాగంలో అర్జునుడు దర్శించాడు.
ఆశ్చర్య,ఆనందాలతో రోమాంచితుడై నమస్కరించాడు.అప్పుడు
అర్జునుడు:
హే మాహాదేవా!దివ్యమైన,ఆదీఅంతము లేని నీలో సమస్త దేవతలను,భూతగణాలను,పద్మాసనుడైన బ్రహ్మను,మహర్షులను అందరినీ చూస్తున్నాను.అన్నివైపులా చేతులతో,ముఖాలతో,కన్నులతో ఉన్న నీ విశ్వరూపాన్ని నేను చూస్తున్నాను.
అసంఖ్యాక కిరీటాలు,గదలు,చక్రాలు ధరించి సూర్యాగ్నుల తేజస్సుతో నీ రూపాన్ని చూస్తున్నాను.
తెలుసుకోవలసిన పరమాత్మవు,ప్రపంచానికి ఆధారము,శాశ్వతుడవు,ధర్మరక్షకుడవు,పరబ్రహ్మంవు నువ్వే అని నిశ్చయించుకున్నాను.
ఆధిమధ్యాంతరహితము,అపరిమిత శక్తియుతము,అనంత బాహువులతో సూర్యచంద్రులే కన్నులుగా ప్రజ్వలితాగ్నిలా గల ముఖకాంతి గలది,తన తేజస్సుతో సమస్త విశ్వాన్ని తపింపచేస్తున్న నీ రూపాన్ని అర్థం చేసుకుంటున్నాను.
సూదిమొన సందు లేని నీ మహోగ్రరూపం చూసి ముల్లోకాలు భయంతో వణుకుతున్నాయి.
సమస్తదేవతా స్వరూపాలు నీలో ప్రవేశిస్తున్నాయి.ఋషులు,సిద్దులు నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నారు.
అన్నిలోకాల వాసులు నిన్ను ఆశ్చర్యంతో చూస్తున్నాయి.
నీ భయంకర విశ్వరూపాన్ని చూసి అన్ని లోకాలు,నేను భయపడుతున్నాము.
నీ విశాల భయంకర నేత్రాలు జ్వలిస్తున్నాయి.నిన్ను చూస్తున్నకొద్ది నా మనసు చలించి ధైర్యం నశించిపోతోంది.నాకు శాంతి లేదు.
కాలాగ్నిలా ఉన్న నిన్ను చూసి నేను భయపడిపోతున్నాను.నన్ను కరుణించు.
అనేకమంది రాజులు,కౌరవులు,భీష్మద్రోణులు,కర్ణుడు నా యోధులు కూడా నీ భయంకరముఖం లోనికి వెళ్తున్నారు.వారిలో కొందరు నీ కోరల మధ్య నలిగి చూర్ణమై పోతున్నారు.
నదులు సముద్రంలో కలుస్తున్నట్లు రాజలోకమంతా నీ భయంకర ముఖాగ్ని లోనికి పొర్లుతోంది.
అన్ని లోకాలు నీ ముఖంలోనికి పడి నాశనమవుతున్నాయి.
నీవు అంతా మింగి వేస్తున్నావు.జగత్తు భయపడుతోంది.ఇంత భయంకరమైన నీవెవరవు?తెలియజెయ్యి.
శ్రీకృష్ణుడు:
సర్వస్వం లయం చేసే కాల స్వరూపుడిని నేను.ప్రస్తుతం నా పని సంహారం.నీవు యుద్ధం మానినా సరే నీవు,కొందరు తప్ప ఇక్కడ ఎవరూ మిగలరు.
లే! యుద్ధానికి సిద్దపడు.శతృసంహారం చేసి భూమండలాన్ని అనుభవించు.నిమిత్తమాత్రుడవై యుద్ధం చేయి.ద్రోణ,భీష్మ,జయద్రథ,కర్ణాదులు అందరినీ ముందే చంపివేశాను.నాచే చంపబడినవారినే నువ్వు చంపబోతున్నావు.యుద్ధం చెయ్యి.జయిస్తావు.
అర్జునుడు:
నీ కీర్తన చేత జగం ఆనందిస్తోంది,రాక్షసులు భయంచే దిక్కు తోచక పరుగెడుతున్నారు.సిద్దులు నీకు మ్రొక్కుతున్నారు.సత్తుకు,అసత్తుకు,బ్రహ్మకు మూలపురుషుడైన నిన్ను నమస్కరించనివారెవరు ఉంటారు?
ఆదిదేవుడవు,సనాతనుడవు,అంతా తెలిసినవాడవు,సర్వ జగద్వ్యాపివి.
బ్రహ్మ కన్నతండ్రివి,అగ్ని,వరుణుడు అన్నీ నీవే.నీకు నా పునఃపునః నమస్కారాలు.
నిన్ను అన్నివైపుల నుండి నమస్కరిస్తున్నాను.
నీ మహిమను గుర్తించలేక చనువుతో కృష్ణా,సఖా,యాదవా అంటూ నిన్ను పిలిచాను. సరసాలాడాను. క్షమించు.
నీకు సమానుడైన వాడే లేనప్పుడు నీ కన్నా అధికుడెలా ఉంటాడు?
తండ్రి కొడుకుని,ప్రియుడు ప్రియురాలిని,మిత్రుడు మిత్రుని తప్పులు మన్నించినట్లు నన్ను మన్నించు.నీ ఈ రూపం చూసి భయం కల్గుతోంది.నీ శంఖ,చక్ర,కిరీట,గదాపూర్వకమైన మునుపటి రూపంలోనికి రా.
కృష్ణుడు:
నీ మీది కరుణతో నా తేజ విశ్వరూపాన్ని చూపించాను.నీవొక్కడు తప్ప పూర్వం ఈ రూపాన్ని ఎవరూ చూడలేదు.
వేదాలు చదివినా, దానధర్మాలు, జపాలు, కర్మలు చేసినా ఎవరూ చూడలేకపోయారు. నీవు భయ పడ వద్దు. నా పూర్వరూపమే చూడు అంటూ సాధారణ రూపం చూపించాడు.
అర్జునుడు:
ఇప్పుడు నా మనసు కుదుటపడింది.
కృష్ణుడు:
దేవతలు కూడా చూడాలని తపించే ఈ రూపదర్శనం తేలిక కాదు.
వేదాలు చదివినా,దానాలు,పూజలు,తపస్సు చేసినా ఈ రూప దర్శనం కలుగదు.
అనన్యభక్తితో మాత్రమే సాధ్యం అవుతుంది.
నా కొరకే కర్మలు చేస్తూ,నన్నే నమ్మి,నాయందు భక్తి కల్గి విశ్వంలో నిస్సంగుడైనవాడు మాత్రమే నన్ను పొందగలడు.
 
**************
Spread iiQ8

December 24, 2015 8:44 PM

254 total views, 0 today